కర్మ ఫలం ఎప్పుడూ భవిష్యత్తులో ఉంటుంది. అది అనేక సంభావ్యతల సమ్మేళనం. మనకు వర్తమానం మీదే తప్ప గతం మీదా, భవిష్యత్తు మీదా నియంత్రణ ఉండదు.
‘‘మనకు కర్మ చేసే అధికారం ఉంది. అయితే కర్మ ఫలం మీద అధికారం లేదు’’ అని శ్రీకష్ణుడు చెప్పాడు. మన కర్మలకు వాటి ద్వారా లభించే ఫలితం (కర్మఫలం) ప్రేరణగా ఉండకూడదనీ, అయితే, దీని అకర్మ (క్రియారహిత స్థితి) వైపు మొగ్గు చూపించడమనేది దీని పర్యవసానం కాకూడదనీ స్పష్టం చేశాడు.
భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన/
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి’ అనే శ్లోకం ఎక్కువగా ప్రస్తావితం అవుతూ ఉంటుంది. ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలు ఈ శ్లోకంలో మనకు కనిపిస్తాయి.
ఈ శ్లోకం తాలూకు అంతరార్థాన్ని గ్రహించాలంటే... తార్కికత లోతుల్లోకి వెళ్ళకుండా, వివిధ కోణాలను విశ్లేషించే ప్రయత్నం చెయ్యకుండా, సారాంశాన్ని అమలు చెయ్యడమే సులువైన పద్ధతి. దానికోసం శ్రీ కృష్ణుడి మీదే శ్రద్ధ పెట్టాలి. అభ్యాసం మొదలుపెట్టాలి. శ్రద్ధ అద్భుతాలు చేస్తుందనీ, ఈ శ్లోకం అచ్చమైన అర్థాన్ని అభ్యాసంలోకి తీసుకువస్తే, కర్మయోగం తాలూకు పరాకాష్టకు అది మనల్ని తీసుకువెళ్తుందనీ కృష్ణుడు తెలిపాడు.
‘మనం చేసే కర్మల వల్ల లభించే ఫలితం మీదే దృష్టి పెడితే... కర్మ మీద ధ్యాసను కోల్పోతాం. దీనివల్ల కర్మ ఫలం తిరస్కారానికి గురవుతుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి కర్మను (అధ్యయనాన్ని) సరిగ్గా చెయ్యకపోతే... అతను కోరుకున్న కర్మ ఫలితం (పరీక్షా ఫలితం) ఎన్నటికీ లభించదు. కాబట్టి మనం ప్రతి సందర్భంలోనూ... చేసే పని మీదే దృష్టిని కేంద్రీకరించాలని శ్రీ కృష్ణుడు ఉద్ఘాటించాడు.
మరో విషయం ఏమిటంటే... కర్మ వర్తమానంలో జరుగుతుంది, కర్మ ఫలం ఎప్పుడూ భవిష్యత్తులో ఉంటుంది. అది అనేక సంభావ్యతల సమ్మేళనం. మనకు వర్తమానం మీదే తప్ప గతం మీదా, భవిష్యత్తు మీదా నియంత్రణ ఉండదు. కనుక, ఎల్లప్పుడూ ప్రస్తుత కర్మ మీదే శ్రద్ధ వహించాలని కృష్ణుడు సూచించాడు.